‘అజ్ఞాతవాసి’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చాల గుణపాఠాలు నేర్పినట్లు కనిపిస్తోంది. ఈమూవీతో ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఏర్పరుచుకున్న ఇమేజ్ మంచు కొండలా కరిగిపోయింది. ఇలాంటి పరిస్థుతులలో ఫిబ్రవరి నుండి ప్రారంభం కాబోతున్న జూనియర్ సినిమా విషయంలో ఎటువంటి సాహసాలు చేయడం ఇష్టం లేని త్రివిక్రమ్ ఈమూవీ కథ విషయంలో ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిలిం నగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ జూనియర్ సినిమా కోసం ఆధారపడుతున్న కథ ఒకనాటి నవలా సాహిత్య మహారాణి యద్దనపూడి సులోచనా రాణి నవల అని అంటున్నారు. గతంలో ‘అ ఆ’ సినిమా విషయంలో కూడ త్రివిక్రమ్ యద్దనపూడి ‘మీనా’ కథను అనుసరించిన విషయం తెలిసిందే.
అయితే ఈసారి ఎటువంటి రూమర్స్ కు ఆస్కారం ఇవ్వకుండా జూనియర్ సినిమా షూటింగ్ మొదట్లోనే యద్దనపూడి నవలను ఆధారంగా ఈసినిమాను తీస్తున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా తెలియచేస్తాడని టాక్. ‘అజ్ఞాతవాసి’ కథ విషయంలో ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ప్రభావం ఉంది అని విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరిగిన నేపధ్యంలో ఈసారి జూనియర్ సినిమా షూటింగ్ మొదట్లోనే త్రివిక్రమ్ యద్దనపూడి ప్రస్తావన తీసుకు వచ్చి ఇక తన పై ఎటువంటి నెగిటివ్ ప్రచారం లేకుండా జాగ్రత్త పడతాడని తెలుస్తోంది.
వాస్తవానికి జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ కథ 1980 ప్రాంతంలో వచ్చిన ఒక ప్రముఖ డిటెక్టివ్ రచయిత వ్రాసిన నవలకు అనుసరణ అంటూ ఇప్పటి వరకు గాసిప్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ జూనియర్ కోసం తిరిగి యద్దనపూడి వైపు యూటర్న్ తీసుకున్నాడు అని వార్తలు రావడం ఆశ్చర్యంగా మారింది. అయితే పదునైన డైలాగ్స్ వ్రాసే త్రివిక్రమ్ ఇలా తన సినిమాల కథల కోసం బయట రచయితల కథల పై ఆధార పడుతూ ఉండటంతో త్రివిక్రమ్ క్రియేటివిటీ ఏమైందీ అన్న సందేహాలు రావడం సహజం..