పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ కు తానే డెడ్ లైన్ ప్రకటించుకుని మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు తనను పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా విమర్శిస్తూ సెటైర్లు వేస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చాడు పవన్. పవన్ ఈరోజు తెలంగాణాలో తన రెండవరోజు పర్యటనలో భాగంగా కరీం నగర్ లోని ఒక ప్రముఖ హోటల్ లో తన ‘జనసేన’ పార్టీ కార్యకర్తలను కలుసుకున్నాడు.
ఆతరువాత వారిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి తాను తెలంగాణ వాదిని అని మరొకసారి చాటుకున్నాడు. 2009 నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెపుతూ రాబోతున్న మార్చి 14లోపు తమ పార్టీ పూర్తి కార్యాచరణ ప్రకటిస్తాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. తన సినిమాల్లో తెలంగాణ భాష కళలకు ప్రాధాన్యతనిచ్చానని పవన్ ఈ సందర్భంగా తన అభిమానులకు గుర్తుకు చేసాడు.
ఇదే సందర్భంలో పవన్ కుల వ్యవస్థ పై కామెంట్ చేస్తూ ప్రస్తుతం రాజకీయాలలో కొన్ని కులాలకే పరిమితం అయ్యాయి అని చెపుతూ ఆర్థిక భద్రత అన్ని కులాలకీ ఉండాలని కామెంట్స్ చేసాడు పవన్. నాలుగేళ్ల పసిబిడ్డ తెలంగాణ రాష్ట్రమని దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అంటూ తనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లు రెండు కళ్ళు అన్న సంకేతాలు ఇచ్చాడు.
అంతేకాదు తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని తుదిశ్వాస వరకూ ఈ గడ్డకు రుణపడి ఉంటానని షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్. ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావం జనసేన లక్ష్యమని చెపుతూ పవన్ తనతో పాతికేళ్ల యుద్దానికి రెడీ అయిన వారు మాత్రమే తనతో చేయి కలపమని యువతకు పిలుపును ఇచ్చాడు పవన్. తెలంగాణ వాదిగా ముద్ర వేయించుకోవడానికి పవన్ చేస్తున్న ఈ ప్రజాయాత్ర పవన్ ను ఎంత వరకు తెలంగాణ ప్రజలకు దగ్గరకు చేరుస్తుందో చూడాలి..