ఈ మద్య టాలీవుడ్ ని ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కాలం చేయడం ఓ వైపు బాధ కలిగిస్తుంటే.. డ్రగ్స్ కలకలం..ఇండస్ట్రీపై విమర్శల వర్షం కురిసేలా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో కో-డైరెక్టర్ గా పని చేస్తున్న రాంరెడ్డి అనే వ్యక్తి, ఓ చానల్ లో కెమెరామెన్ గా ఉన్న కృష్ణ భవన్ రాజు అలియాస్ వర్మపై దారుణంగా కత్తితో దాడి చేయడం హైదరాబాద్ పరిధిలోని ఇందిరానగర్ లో కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం..తూర్పుగోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, అయినపురం గ్రామానికి చెందిన కృష్ణ భవన్ రాజు ఇందిరానగర్ లో ఉంటుండగా, అతనికి రాంరెడ్డి పరిచయం అయ్యాడు. నెల క్రితం ఇద్దరూ కలిసి ఓ గది అద్దెకు తీసుకున్నారు. అయితే గత కొంత కాలంగా కో-డైరెక్టర్ రాంరెడ్డి మానసిక ఆవేదన చెందుతున్నట్లు.. రాంరెడ్డి తరుచూ నిద్రలో లేచి తనను ఎవరో చంపడానికి వస్తున్నారంటూ కలవరించడంతోపాటు అదే విషయాన్ని 100 నెంబర్కు డయల్ చేసి చెప్పేవాడు.
విచారణలో అతడిది అపోహ అని తేల్చిన పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. సోమవారం రాత్రి ఒంటగంట ప్రాంతంలో వర్మ డాబా మీద ఉండగా రాంరెడ్డి కూరగాయల కత్తి తీసుకొని దాడి చేశాడు. అతడి నుంచి రక్షించుకునేందుకు వర్మ ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండు చేతులకు గాయాలయ్యాయి. ఆ తరువాత రాంరెడ్డి కిడ్నీ ప్రాంతంతోపాటు కడుపులో పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డు మీదకు పరుగులు తీశాడు.
ఓ ఏటీఎం పక్కన స్పృహతప్పి పడిపోయిన వర్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని నిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్చారు. రాంరెడ్డి పరారీలో ఉన్నాడని, కేసు దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వర్మను 108లో మొదట శ్రీనగర్కాలనీలోగల తన్వీర్ ఆస్పత్రికి.. అనంతరం నిమ్స్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాంరెడ్డి పరారీలో ఉన్నాడు