భారత దేశంలో అందాల తారగా ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించిన నటి శ్రీదేవి. అందము,అభినయం,నటన లో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. శ్రీదేవి తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో గుండెపోటుతో మరణించింది. శ్రీదేవి మరణంతో సినీ ఇండస్ట్రీనే కాదు..యావత్ భారత దేశంలో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా ఉండే శ్రీదేవి అర్ధాంతరంగా మరణించడం ఇప్పటికి నమ్మశక్యంగా లేదని వారంటున్నారు.
ఇక ఇండస్ట్రీలో శ్రీదేవిని రోల్ మోడల్ గా తీసుకొని ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటన, అభినయం..హావభావాలు కాపీ కొట్టే హీరోయిన్లు కూడా చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు. ఇక బాలీవుడ్ లో శ్రీదేవిని ఎంతో అభిమానించే హీరోయిన్ కంగనా రౌనత్. శ్రీదేవి నటనని, ఆమె నృత్యాన్ని చూసి ఎంతో నేర్చుకున్న కంగనా, శ్రీదేవి మరణవార్త వినగానే తీవ్రమైన జ్వరం బారిన పడ్డారని ఆమె సన్నిహితులు అంటున్నారు.
శ్రీదేవి మరణం కంగనాను ఎంతో కుంగదీసిందట. ప్రస్తుతం కంగనా ఎవరితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదట. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత నేపథ్యంలో మణికర్ణిక అనే సినిమా చేస్తున్న కంగనా, అనారోగ్యం కారణంగా షూటింగ్కి కూడా వెళ్ళడం లేదట. దీంతో కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ దర్శకులు క్రిష్ ‘మణికర్ణిక’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.