ఈ మద్య బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రముఖ నటి శ్రీదేవి మరణం జీర్ణించుకోక ముందు మరో బాలీవుడ్ నటుడు మరణించారు.  తెలుగు ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాల్లో విలన్ గా  నటించి మెప్పించిన  బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో బాజీరావుగా క్రూరత్వాన్ని పండించారు నరేంద్ర ఝా.

స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆయన, కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ తో పాటు, టీవీ సీరియల్స్ లోనూ నటించారు. 2002లో 'ఫంటూష్' ద్వారా బాలీవుడ్ తెరపై తొలిసారి కనిపించిన ఆయన, 'గదర్', 'రాయీస్', 'మొహంజోదారో' వంటి హిందీ చిత్రాలతో పాటు తెలుగులో 'యమదొంగ', 'లెజండ్', 'ఛత్రపతి' తదితర చిత్రాల్లో నటించారు. 

మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లా వాడాలో ఉన్న తన ఫామ్ హౌస్‌లో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో నరేంద్ర అక్కడే కుప్పకూలిపోయినట్లు సన్నిహితులు వెల్లడించారు.

ఆయనకి గుండెపోటు రావడం ఇది మూడోసారని తెలిపారు.సల్మాన్ హీరోగా త్వరలో రానున్న హిందీ చిత్రం 'రేస్-3' ఆయనకు ఆఖరి చిత్రం. కాగా, ఝా మృతిపట్ల పలువురు నటీ నటులు, నిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: