ఇప్పటి వరకు తెలుగు తెరపై కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించి యావత్ భారత దేశాన్ని అబ్బుర పరిచిన సినిమా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’. దర్శకధీరుడు రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడి తీసిన ఈ సినిమాలు ప్రపంచ స్థాయిలో మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. అంతే కాదు భారత దేశంలో అత్యధికంగా వసూళ్లు చేసిన సినిమాగా బాహుబలి 2 రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే కాకుండా అమెరికా, జపాన్, టోక్యో, ఒసాకోలో ఈ మూవీ ప్రదర్శన జరుపుకుంది.
చైనాలోను విడుదలయ్యేందుకు సిద్ధమైంది. విదేశాలలో ఈ చిత్రానికి లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఒక తెలుగు దర్శకుడు ఇంత గొప్ప సినిమాలు తెరకెక్కించినందుకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అందుకున్నారు. ఇందులో నటించిన నటీనటులకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తాజాగా జక్కన్నకు మరో అరుదైన గౌరవం దక్కింది. పాకిస్తాన్ లోని కరాచీలో జరగనున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు.
ఇందుకు గాను.. రాజమౌళికి పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి. బాహుబలి చిత్రం పలు దేశాలలో పర్యటించే అవకాశం కలిపించింది. ఇప్పుడు పాకిస్థాన్లో పర్యటించే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి నన్ను ఆహ్వానించినందుకు పాకిస్థాన్, కరాచీకి ధన్యవాదాలు అని రాజమౌళి అన్నారు.
పాకిస్థాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాహుబలి, డియర్ జిందగీ, జాలీ ఎల్ఎల్బీ 2, హిందీ మీడియం, సైరాట్, నీల్ బత్తే సన్నాటా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. బాహుబలి సినిమాలో ప్రభాస్, అనుష్క, రానా , తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా క్రేజీ మల్టీ స్టారర్ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.