‘చెప్పను బ్రదర్’’ కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ అభిమానులకు శత్రువుగా మారిపోయిన అల్లుఅర్జున్ ఆతరువాత తాను చేసిన కామెంట్స్ వల్ల అనేక సమస్యలు ఎదుర్కున్నాడు. ఈమాటలు ఇంకా పవన్ అభిమానులు మరిచిపోకుండానే లేటెస్ట్ గా అల్లుఅర్జున్ ఒక జాతీయమీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మన ఇరు తెలుగురాష్ట్రాలలోని చాలామంది తెలుగువారికి తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లుఅర్జున్ ను రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక స్టార్ ఆఫ్ ది మిలీనియంగా గుర్తిస్తూ ఆపత్రిక బన్నీ ముఖచిత్రంతో ఆసక్తికర కథనాన్ని కవర్ పేజీ ఆర్టికల్ గా ప్రచురించింది. ఈసందర్భంగా ఆపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన ఇన్ స్పిరేషన్ ప్రధానమంత్రి మోడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు బన్నీ.
ఇప్పుడు ఈకామెంట్స్ సోషల్ మీడియాలో చిచ్చు రేపి అల్లుఅర్జున్ పై చాలమంది నెగిటివ్ కామెంట్స్ చేసేలా దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి స్పెషల్ స్టేటస్ విషయంలో మోడీ మాట తప్పారు అని తెలుగు ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్న నేపధ్యంలో విభజన హామీల అమలులో మాట తప్పిన మోడీ అల్లుఅర్జున్ కు ఏరకంగా ఇన్ స్పిరేషనో చెప్పాలంటూ బన్నీ పై మాటల దాడి జరుగుతోంది. అంతేకాదు తెలుగు వాడిగా అల్లుఅర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లుఅర్జున్ తన సినిమాల మార్కెట్ ను కోలీవుడ్ లో పెంచుకోవడానికి కూడ చాల ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కావేరీ జల వివాదంలో భారతీయ జనతాపార్టీ అనుసరిస్తున్న ద్వంద వైఖరి పై తమిళ ప్రజలు కోపంతో ఉన్న నేపధ్యంలో బన్నీ అన్న మాటలు తమిళ యూత్ కు కూడ కోపం కలిగించినట్లు టాక్. ఏమైనా యధాలాపంగా అల్లుఅర్జున్ అన్నమాటలు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ‘స్టార్ ఆఫ్ ది మిలీనియమ్’ అని బిరుదు వచ్చిన ఆనందం పూర్తిగా బన్నీ ఎంజాయ్ చేయకుండానే ఇలా అనుకోని మాటల దాడిని ఎదుర్కోవడంతో షాక్ అయ్యాడని టాక్..