శ్రీరెడ్డి.. టాలీవుడ్ లో ఓ సంచలనం. సినిమా ఇండస్ట్రీలోని పలు అంశాలపై ఆమె ఉద్యమిస్తోంది. ఆమె ఉద్యమానికి ఇటీవలే పలువురు మద్దతు పలికారు. దీంతో ఆమె ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. అయితే ఆమె ఉద్యమంలో క్లారిటీ కొరవడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె కథ రోజుకో మలుపు తిరుగుతూ ఏ తీరం చేరుతుందోననే ఉత్కంఠ మొదలైంది.
శ్రీరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చింది .. టాలీవుడ్ లో తెలుగు వారికే 75 శాతం అవకాశాలు కల్పించాలని.! టాలీవుడ్ లో ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు లభిస్తున్నాయి కానీ లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించడం లేదని శ్రీరెడ్డి ఆరోపించింది. తెలుగు నటులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఆ క్రమంలో వెంటనే కాస్టింగ్ కౌచ్ ను బయటపెట్టింది. టాలీవుడ్ లో అమ్మాయిలను వాడుకుని వదిలేస్తున్నారని .. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది. దీనికి సంబందించి ఆమె కొంతమందితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, చాట్ లను బయటపెట్టింది.
అయితే.. అంతటితో ఆగని శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టింది. ఇది పలు విమర్శలకు దారితీసింది. ఇంత జరిగినా శ్రీరెడ్డి ఇష్యూపై స్పందించేందుకు సినిమా పెద్దలెవరూ ముందుకు రాలేదు కానీ మా ముందుకొచ్చింది. మొదట శ్రీరెడ్డిని బాయ్ కాట్ చేసిన మా.. ఆ తర్వాత తనకు మద్దతిచ్చింది. లైంగిక వేధింపులపై విచారణకోసం క్యాష్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది మా.! ఇది శ్రీరెడ్డి సాధించిన విజయం. దీంతో శ్రీరెడ్డి స్టార్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాతే శ్రీరెడ్డి ఉద్యమం దారి తప్పింది.
ఈ క్రమంలో శ్రీరెడ్డి ఓ న్యూస్ ఛానల్ లో డిబేట్ లో పాల్గొంది. ఇందులో ఫోనోలో పాల్గొన్న ప్రగతిశీల మహిళా సంఘం నేత సంధ్య.. నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భర్త రాజశేఖర్ దగ్గరకు జీవిత రాజశేఖరే అమ్మాయిలను పంపుతుందని ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జీవిత.. పరువునష్టం దావా వేశారు. ఆ ఛానల్ సీఈవోతో పాటు సంధ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక.. పవన్ కల్యాణ్ పాదాల చెంత స్థానమిచ్చినా చాలని వేడుకున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు విజయగర్వంతో ఆయన్నే టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసింది. ఆయన్ను అన్నా అని పిలిచినందుకు సిగ్గు పడుతున్నాననంటూ చెప్పుతో కొట్టుకుంది. దీంతో ఇది రాజకీయ టర్న్ తీసుకుంది. పవన్ కల్యాణ్ విమర్శల వెనుక రాజకీయ హస్తముందంటూ పవన్ సోదరుడు నాగబాబు ఆరోపించారు. దీన్ని జనసేన కూడా సీరియస్ గా తీసుకుని విచారణ చేసింది. శ్రీరెడ్డితో పాల్గొన్న ఓ మహిళకు వైసీపీతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు గుర్తించింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా బయటపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరెడ్డి కూడా వైసీపీనే ఇదంతా చేయిస్తోందని వాపోయింది. తన ఉద్యమాన్ని నీరుగార్చేందుకే వైసీపీ పెద్ద ప్లాన్ వేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతకుముందు.. పవన్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయాలని రాంగోపాల్ వర్మే సూచించాడని శ్రీరెడ్డి తెలిపింది. అలా చేయడం ద్వారా పెద్దఎత్తున నగదు ముడుతుందని, దాంతో సర్దుకుపోవాలని ఆర్జీవీ సలహా ఇచ్చాడని వెల్లడించింది. దీన్ని ఆర్జీవీ కూడా అంగీకరించాడు. తాను సలహా ఇచ్చిన మాట వాస్తవమేనన్నాడు. ఓ నిర్మాత కొడుకు మోసం చేశాడన్న వ్యవహారంలో రాజీకి రావాలని కూడా చెప్పానన్నాడు. దీనికి సంబంధించి 5 కోట్లు ఆఫర్ చేసినా శ్రీరెడ్డి తిరస్కరించిందని చెప్పాడు.
మొత్తానికి శ్రీరెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు టాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతూ ఏ గమ్యానికి చేరుతుందోననే ఉత్కంఠ కలిగిస్తోంది. మరి ఈ ఎపిసోడ్ కు ఎక్కడ ఫుల్ స్టాప్ పడ్తుందో.. వేచి చూడాలి.