గత కొన్ని రోజులుగా సినీ నటి శ్రీరెడ్డి పోరాటం టాలీవుడ్ను కుదిపేస్తోంది. ముఖ్యంగా శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) వ్యవహరించిన తీరు విమర్శలపాలవుతోంది. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘మా’ అసోసియేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’పై విమర్శలు ఎక్కుపెడుతూ ఓ లేఖను విడుదల చేశాడు. శ్రీరెడ్డి వ్యవహారంలో ‘మా’ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ ‘మా’ అధ్యక్షుడికి లేఖ రాశారు.తెలుగు సినీ పరిశ్రమలోని సభ్యుల సంక్షేమం కోసమే ఈ అసోసియేషన్ ఏర్పిడిన సంగతిని ఆయన గుర్తుచేశారు.
అంతేకాకుండా విపత్తులు, ప్రకృతి వైపరిత్యాల సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ అసోసియేషన్ ఏర్పాటైందన్నారు. ఈ కారణాలతోనే చాలా మంది నటులు ఈ అసోసియేషన్లో చేరారని, కాలక్రమేనా సభ్యుల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. తెలుగు సినిమా వాళ్ల సంక్షేమం కోసం ఈ సంఘం ఏర్పడింది. ‘మా’లో మెంబర్షిప్ లేని ఓ వ్యక్తి విషయంలో ‘మా’ వ్యవహరించిన తీరు గందరగోళంగా ఉంది. ఆమె చేసిన ఆరోపణల కారణంగా హడావిడిగా సమావేశం నిర్వహించి ‘మా’లో సభ్యత్వం ఉన్న 900 మందిలో ఎవరూ ఆమెతో నటించకూడదని నిషేధం విధించారు. అయితే ఆ 900 మందిలో మా నాన్నగారు, నేను, మా అక్క, మా తమ్ముడు కూడా ఉన్నాం.
మమ్మల్ని కూడా కలిపే చెప్పారా? ఓ నటుడిగా, నిర్మాతగా ఎవరితో నటించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన హక్కు నాకుంది. అలాంటిది మీ పాటికి మీరే నిర్ణయం ఎలా తీసుకుంటారని అని విమర్శించారు. మీరే కాదంటారు..ప్రొటెస్ట్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబాలపై, వ్యక్తులపై విమర్శలు చేయగానే.. ఆ నిషేధం ఎత్తేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ‘మా’ పరువు పోతోంది. ప్రజల, మీడియా దృష్టిలో చులకన అయిపోతోంది. దయచేసి మీ చర్యలతో ‘మా’కు చెడ్డ పేరు తీసుకురాకండి.
ముందుగా ‘మా’కు మార్గదర్శకాలు ఏర్పాటు చేయండి. సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్లు తప్పనిసరిగా ఆ మార్గదర్శకాలను అనుసరించే విధంగా చర్యలు తీసుకోండి. ప్రస్తుతం ‘మా’లో సభ్యత్వం లేని స్థానిక నటులు చాలామంది ఉన్నారు. ఈ విషయంలో గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు బాధ్యతను ‘మా’కు కాకుండా ఫిల్మ్ ఛాంబర్కు అప్పగించాలి` అంటూ మంచు విష్ణు సూచనలు చేశారు. శ్రీరెడ్డి విషయంలో అసోసియేషన్ ప్రవర్తించిన తీరును ఎండగడుతూ అధ్యక్షుడు శివాజీరాజాకు విష్ణు బహిరంగ లేఖ రాశారు.