తనను వెనుకనుండి నడిపించటానికి ఏ రాజకీయ పార్టీ అండ తనకు లేదని సినీనటి శ్రీరెడ్డి తెలిపారు. రాజకీయ నాటకాలు చేయటం తనకు చేతకాదని ఆమె పేర్కొన్నారు. తనను చంద్రబాబు, నారా లోకేశ్, మరి కొందరు రాజకీయ నేతలు నడిపిస్తున్నారని జనసేన అధినేత సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై తన 'ఫేస్ బుక్ పేజ్'లో స్పందించారు. పోరాటం చేయగలనేమో గాని పోరాటం చేస్తున్నట్టు నటించడం తనకు రాదని తెలిపారు. ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో? ప్రజలు అందరికీ తెలుసునని పరోక్షంగా పవన్ కల్యాణ్ను ఉద్దేశించి అన్నారు.
"మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకూ అన్తే. మా మీద, మాపై కోపంతో మా తల్లులను మీరు మాటలు అన్నప్పుడు, రోడ్డుమీద కూడా మమ్మల్ని రేప్లు చేస్తున్నప్పుడు, యాసిడ్ పోస్తున్నప్పుడు బెదిరింపులతో భయపెడుతు ఉన్నపుడు మా బాధ అర్థం కాలేదా?" అని శ్రీరెడ్డి ప్రశ్నించారు. పోరాటం ముందు తన ప్రాణం తృణ ప్రాయమని అవసరమైతే ప్రాణం పోయినా లెక్కచేయబోనని, వీరనారిలా వీరమరణానికి తాను సర్వదా సిద్ధమని ఆమె ప్రకటించారు.
"మీ ఆధిపత్యం మీసినిమాల్లో చూపించండి,"మా" ఫిలిం ఛాంబర్ మీద చూపించకండి, జర్నలిస్టుల మీద బురదచల్లితే అదే చింది మీ మీదే బురద మరకలు పడతాయని, జర్నలిస్టుల జోలికివస్తే అసలు బాగుండదు" అని హెచ్చరించారు. తన పోరాటం తనబొందిలో ప్రాణం ఉన్నంతవరకు చివరిశ్వాస వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
"నిజాలు త్వరలో బయటకు వస్తాయి. ఒక రోజు ఎవరో ఒకరు ఏదో హడావుడి హంగామా చేసి భయపెడితే తోకముడిచి పారిపోయే రకం కాదు నా పోరాటం. పదేళ్ల క్రితం సర్వం వదిలేసి నాకు నచ్చే నా అభిరుచిని సాధించుకోవటానికి ఒంటరిగా వచ్చాను. అభిరుచి అదే సినిమాలో కథానాయకి అవ్వాలన్న కోరిక నేరవేరకపోగా అంతకు మించి నరకం చాలా అనుభవించా, అయినా ఇప్పటికి కూడా ఎవరినీ వదలను" అని అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మకు, వార్తా చానళ్లకు ఆమె క్షమాపణ చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమలో "కాస్టింగ్ కౌచ్" కు వ్యతిరేకంగా గళమెత్తిన శ్రీరెడ్డిపై పలువురు సినిమా ప్రముఖులు మండిపడుతుండగా, జూనియర్ ఆర్టిస్టులు, మహిళాసంఘాల నాయకులు ఆమెకు బాసటగా నిలిచారు.