ఈ మద్య బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. వరుసగా కోర్టు కేసులు ఆయన్ని వెంటాడుతున్నాయి. ఆ మద్య హిట్ అండ్ రన్ కేసు, కృష్ణ జింక కేసుల్లో కాస్త ఊరట లభించిందనగానే..వాల్మీకి సమాజాన్ని అవమానించాడని ఆరోపిస్తూ సల్మాన్పై పలు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి.
తాజాగా దేశ వ్యాప్తంగా ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో విచారణను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ‘టైగర్ జిందా హై’ సినిమా ప్రచారంలో భాగంగా వాల్మీకి కులస్తులపై సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. ‘టైగర్ జిందా హై’ ప్రమోషన్ లో సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై వాల్మీకి సామాజికవర్గానికి చెందిన పలువురు.. సల్మాన్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తమను అవమానించారని ఆరోపిస్తూ, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు కేసులు నమోదు చేయించారు.
ఈ పిటిషన్ను సోమవారం విచారించిన కోర్టు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విచారణను నిలుపుదల చేయాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సల్మాన్ఖాన్పై ఎలాంటి కేసులు నమోదు చేయరాదని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉన్నారు.సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును విచారించి, స్టే విధించింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 23న జరుగుతుందని తెలిపింది.