మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. నాన్ బాహుబలి కేటగిరీలో రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా రికార్డుల కెక్కింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చి 30న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. నెల రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా రాబట్టి టాలీవుడ్లో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా(నాన్-బాహుబలి) నిలిచింది.
మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను భారీ వసూళ్లు సాధిస్తోంది కానీ అనుకున్న స్థాయిలో మాత్రం రికార్డుల మోత మోగడం లేదు. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రామ్ చరణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆది పినిశెట్టి, సమంత, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ విలేజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ మలిచిన తీరు.. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, పాటలకు సాహిత్యం, ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో చిత్రం అనుకున్న స్థాయికన్నా మరింత విజయం సాధించింది.
సినిమా విడుదలైన తొలి వీకెండ్లోనే రూ. 100 కోట్ల మార్కును అందుకున్న రంగస్థలం.... రెండు వారాలు పూర్తికాక ముందే (11 రోజుల్లో) 150 కోట్లు వసూలు చేసింది. తాజాగా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుని రూ. 200 కోట్ల క్లబ్లో చేరింది.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ. 116 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కూడా రంగస్థలం దుమ్మురేపింది. ఇప్పటి వరకు 3.49 మిలియన్ డాలర్ వసూలు చేసింది. ఓవరాల్ రన్లో 3.5 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందని అంచనా.