ఫేమస్ ఒడియా నటి అనితా దాస్ ఇక లేరు. ఒడియా చలన చిత్ర నటి అనితా దాస్ (57) శుక్ర వారం మరణించారు. కొద్ది పాటి గుండెపోటుతో ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. 100కు పైబడి చిత్రాల్లో ఆమె నటించారు. తల్లి పాత్రకు ఆమె కొత్త ఒరవడి దిద్దిన నటిగా పేరొందారు. 1957వ సంవత్సరం నుంచి ఆమె చలనచిత్ర రంగంలో నటిగా వెలుగొందారు.
ఆమె నటించిన సినిమాల్లో కృష్ణ సుదామా(1976), రామాయన్(1980), మాఓమమతా(1980), స్వప్న సాగరా(1983), పా మోరా కాలా తాకురా(1988), గధి జానిలె ఘర సుందర(1994), బహుదిబె మో జగా బాలియా(2003), సాథిరె(2004), ఓ శాంతి ఓం(2005), ఆమా భితరె కిచ్చి అచ్చి(2010), శపత్(2012), అభయ్(2017) లాంటివి పాపులర్ అయ్యాయి.\
అనితా దాస్ మరణంపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. అకాల మరణంతో వెండి తెర, బుల్లి తెర వీక్షకులు అపురూపమైన నటిని కోల్పోయారని ఆయన సానుభూతి ప్రకటించారు.
ఒడియా చలన చిత్ర, టెలివిజన్ నటనా రంగానికి ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ పట్నాయక్ కూడా అనితకు నివాళులు అర్పించారు. ఒడియా ఫిలిం ఇండస్ట్రీలో అనిత లేని లోటు తీర్చలేనిదన్నారు. పలువురు చలన చిత్ర రంగ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఆమె మరణం ఒడియా చలన చిత్ర రంగానికి తీరని లోటు అంటూ కన్నీరు కార్చారు