ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుసగా సీనియర్ నటుల అకాల మరణం హృదయాలను కలచి వేస్తుంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు కళాశాల బాబు(63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఎర్నాకుళంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు వెల్లడించారు. కొంతకాలంగా గుండె, మెదడు సంబంధిత సమస్యలతో ఆయన సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని అమృతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కళాశాల బాబు కన్నుమూశారు.
ప్రముఖ కథాకళి కళాకారులైన కళామండలం కృష్ణన్ నాయర్, మోహినియట్టమ్ నృత్యకారిణి కళ్యాణి కుట్టి అమ్మ కుమారుడైన కళాశాల బాబు...నాటకరంగంలో తన కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత సినిమాల వైపు అడుగులు వేశారు. మలయాళ చిత్రం 'ఇనెయా థేడి బై జాన్ పాల్' సినిమా ద్వారా ఆయన ఫిల్మ్ కెరీర్ ప్రారంభించారు. 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.
కస్తూరిమన్, లయన్ మూవీలతో గుర్తింపు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గానూ నటనలో రాణించారు. మమ్ముట్టితో 'తురుప్పు గులన్', దిలీప్తో 'రన్ వే', మోహన్ లాల్తో 'బాలెట్టన్', మమ్ముట్టి, పృధ్విరాజ్తో కలిసి 'పోక్కిరి రాజా' లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. కళాశాల బాబు ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్లతో పాపులర్ అయ్యాడు.
ఎంతటి కష్టతరమైన పాత్రలైనా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన భార్య లలితతో కలిసి ఉండటుండగా, కూతురు శ్రీదేవి యూఎస్ఏ, కుమారుడు విశ్వానాథన్ ఐర్నాండులో సెటిల్ అయ్యారు. బాబు మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల మలయాళ ఇండస్ట్రీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబానికి పలువురు నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.