‘శ్రీమంతుడు’ లో గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీ దగ్గరకు వచ్చే సరికి ప్రజలపట్ల నాయకుడికి జవాబుదారీ తనం ఉండాలి అంటూ సందేశాలు ఇచ్చాడు. ఇలా తాను నటించే సినిమాలలో రకరకాల సందేశాలు ఇస్తున్న మహేష్ తన వ్యక్తిగత జీవితంలో కూడ కొన్ని విలువలు పాటిస్తూ తన అభిమానులకు స్పూర్తిని ఇవ్వాలి అని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తున్న మహేష్ ఇప్పుడు పేద క్రీడాకారుల కోసం తన వంతుసాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
మనదేశంలో చాలామంది టాలెంటెడ్ క్రీడాకారులు ఉన్నా వారిని ప్రొత్సాహించి అవసరమైన క్రీడా సామాగ్రి కోచింగ్ గైడెన్స్ ఇప్పించే వ్యక్తులు సంస్థలు చాల తక్కువగా ఉన్నాయి. ప్రస్థుత పరిస్థుతులలో ఇలాంటి విషయాల పై దృష్టి పెట్టడానికి మన ప్రభుత్వాలకు సమయం లేదు. ఇలాంటి పరిస్థుతులలో ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్.ఆర్.ఐ సేవా ఫౌండేషన్ పేరుతో యువ క్రీడాకారులకు సేవ చేస్తున్న సందర్భంలో మహేష్ తన సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చాడు.
కొన్ని నెలలుగా ఈ ఎన్.జీ.వోకి మహేష్ ఆర్థిక సాయం చేస్తున్నాడట. అయితే తాను చేస్తున్న ఆర్ధక సహాయ విషయం బయటపెట్ట వద్దని మహేష్ ఈసంస్థ నిర్వాహకులను కోరాడట. దీనికి కారణం మహేష్ చేస్తున్న సహాయానికి సంబంధించిన వార్తలు బయటకు వస్తే ఇది అంతా ‘భరత్ అనే నేను’ మూవీ ప్రమోషన్ కోసం చేస్తున్న ఎత్తుగడ అన్న విమర్శలు వస్తాయి కాబట్టి మహేష్ తన సహాయం విషయంలో మౌనం పాటించాడట.
అయితే ఈవిషయం ఇప్పుడు అనుకోకుండా బయటపడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘ఉచితా క్రీడల శిక్షణా శిబిరం’ ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను స్వయంగా మహేష్ ఆవిష్కరించడం విశేషం. ఈ శిబిరంలో భావి తరాల ఆటగాళ్లకి అవసరమైన క్రీడా శిక్షణతో పాటు ఫిట్ నెస్ ఎలా సాధించాలో కూడా ఉచిత క్లాసులు తీసుకుంటున్నారు. దీనితో ఇప్పటి వరకు మహేష్ పిలుపుతో గ్రామాలను దత్తత తీసుకున్న ఎందరో అభిమానులు ఇప్పుడు వర్ధమాన క్రీడాకారులను కూడ దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..