తెలుగు ఇండస్ట్రీలో ఎస్.జానకి అంటే తెలియని వారు ఉండరు..తన గానామృతంతో కోట్ల మందిని మంత్ర ముగ్ధులను చేసి గొప్ప గాయని ఎస్ జానకి. దాదాపు 65 సంవత్సరాల పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, జర్మనీ, లాటిన్,జపనీస్, పంజాబీ ఇలా ఎన్నో భాషలలో దాదాపు 50,000 వరకు పాటలు పాడి అలరించారు గాన కోకిల ఎస్ జానకి. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.
తొలిసారి 1952లో దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్ తో కలిసి మైసూరు నుంచే పాటలను పాడి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది జానకి . ది నైటెంగెల్ ఆఫ్ సౌత్ అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మకి ఈ ఏడాది బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం అందజేయనున్నారు.
ప్రతి ఏడాది బాలు పుట్టిన రోజు సందర్భంగా వివిధ రంగాలకి చెందిన ప్రముఖులకి బాలసుబ్రహ్మాణ్యం జాతీయ పురస్కారం అందజేస్తూ వస్తున్నారు. జానకమ్మ ఆశీస్సులతో ఇంత పెద్ద గాయకుడిని అయిన నాకు ఆమెని సత్కరించుకునే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని బాలు అన్నారు.