తమిళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ గా చిత్రాలు తెరకెక్కించే ప్రముఖ స్టార్ దర్శకులు శంకర్ పై తమిళ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. అసలు విషయానికి వస్తే.. తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి వారు పూనుకున్నారు.
ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, తమిళనాడు అట్టుడుకుతోంది. తమిళనాడులో ప్రజలకు ఇటివంటి సమస్య తలెత్తినా అక్కడి చిత్ర పరిశ్రమ అండగా నిలబడుతోంది. వారి పోరాటంలో పాలుపంచుకుంటోంది. జల్లి కట్టు, కావేరి జలాలు వివాదం వంటి అంశాలలో తమిళ చిత్ర పరిశ్రమ పోరాటాన్ని మనం గమనించాం. మంగళవారం రోజు ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ ని ఉద్దేశించి శంకర్ వాట్ ఏ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. దీనితో శంకర్ పై తమిళ జనం విమర్శలతో విరుచుకుపడుత్నారు. తమిళనాడు హై టెన్షన్ తో ఉంటే..మనుషుల ప్రాణాలు పోతుంటే క్రికెర్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. నీవు అసలు మనిషివేనా అని మండిపడ్డారు. దీంతో, తన ట్వీట్ ను శంకర్ తొలగించారు.