తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘మహానటి’ చిత్రం గురించి ఎక్కడో అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. మొదట్లో ఈ చిత్రంపై ఎన్నో అనుమానాలు ఉన్నా..థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ‘మహానటి’ చిత్రాన్ని చూసిన వారు కంటతడి పెట్టకుండా ఉండలేరని..ఈ చిత్రంలో సావిత్రి జీవితంపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా టాప్ చిత్రాలు రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య చిత్రాలతో పోటీ పడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక చిత్ర నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను మేకర్లు ఒక్కోక్కటిగా యూట్యూబ్లో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ మిస్సమ్మ సినిమాలోని వారాయో వెన్నిలావే (రావోయి చందమామ) సాంగ్ సీన్ను విడుదల చేశారు.
జెమినీ గణేషన్-సావిత్రి రోల్స్లో దుల్కర్-కీర్తి సురేష్లపై చిత్రీకరించిన సీన్ చాలా అద్భుతంగా ఉంది. అంత మంచి సీన్ ఉన్నా..ఎందుకు తీసి వేశారో అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా సాధించటంతోపాటు ఓవర్సీస్లోనూ మహానటి ప్రభంజనం కొనసాగిస్తోంది. సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న, ప్రియాంక దత్లు సంయుక్తంగా నిర్మించారు.