కొరటాల శివ తాను ‘భరత్ అనే నేను’ తరువాత చిరంజీవి తీయబోయే సినిమా విషయం పై క్లారిటీ రావడంతో ఈసినిమాకు సంబంధించిన ప్రాధమిక చర్చలు ఈమధ్య మెగా స్టార్ తో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల తన మనసులో ఉన్న మూడురకాల కథలను స్థూలంగా చిరంజీవికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈకథలలో ఒక కథకు సుముఖంగా ఉన్న చిరంజీవి కొన్ని మార్పులను చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాధమిక చర్చలలో చిరంజీవి కొరటాలకు చేసిన సూచన లాంటి కండిషన్ కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. కొరటాల చిరంజీవితో తీయబోయే సినిమాలో ‘భరత్ అనే నేను’ మూవీలో ఉన్న విధంగా దుర్గా మహల్ ధియేటర్ యాక్షన్ సీన్స్ పెట్టవద్దని ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కు తక్కువ ప్రాధాన్యత ఇవ్వమని చిరంజీవి కొరటాలకు సూచించినట్లు టాక్.
ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సైరా’ మూవీలో ఆసినిమా కథకు అవసరమైన పరిస్థుతులలో తాను భారీ యాక్షన్ సన్నివేశాలు చేస్తునాను అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి తన సమస్యను కొరటాలకు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు డూప్ లేకుండా ఒరిజనల్ గా చేయడంతో తన ఒళ్ళు హూనం అవుతున్న సంగతి కొరటాలకు వివరిస్తూ అతడు తీయబోయే సినిమాలో తన వయస్సును దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసుకోమని చిరంజీవి గట్టి సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో చిరంజీవి తాను నటిస్తున్న ‘సైరా’ నరసింహా రెడ్డి సినిమాలో తరుచూ షూటింగ్ స్పాట్ లో అలిసిపోతున్నాడు అని వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లు అయింది. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చిరంజీవి అలసట వల్ల అనేకసార్లు వాయిదా పడుతున్న నేపధ్యంలో ఈమూవీ ఇచ్చిన అనుభవంతో ఇక భవిష్యత్ లో చిరంజీవి యాక్షన్ సన్నివేశాల జోలికి ఇక వెళ్ళడేమో అని అనిపిస్తోంది. ఇప్పటివరకు కొరటాల తీసిన సినిమాలలో సామాజిక సందేశంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడ చాల ఎక్కువగా కనిపిస్తాయి. అయితే చిరంజీవి సలహాతో కొరటాల యాక్షన్ సన్నివేశాలను పూర్తిగా తగ్గించివేసి సందేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కొరటాల రికార్డుల స్థాయిలో విజయాలు లభిస్తాయా అన్నదే ప్రశ్న..