మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ‘ధృవ’ సినిమాతో మంచి విజయం అందుకున్న రాంచరణ్ చాలా గ్యాప్ తీసుకొని సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాలో నటించాడు. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతూ వచ్చాయి..అయితే షూటింగ్ కూడా సంవత్సర కాలం పట్టింది. పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో మంచి సక్సెస్ సాధించారు దర్శకులు సుకుమార్.
ఇక చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ జీవించడమే కాదు..అద్భుతంగా మెప్పించాడు. ఇక సమంత కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించి విమర్శకులు నుంచి ప్రశంసలు పొందింది. సంచలన విజయం సాధించిన ‘రంగస్థలం’సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఈ సినిమా క్లైమాక్స్ను దర్శకరచయిత సుకుమార్ కాపీ కొట్టాడు అని ఒక రచయిత ఆరోపించాడు. ఆరోపించడమే కాదు.. దీనిపై రైటర్స్ అసోసియేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు.
తను రచించిన ‘ఉక్కుపాదం’ అనే కథ నుంచి ఒక పాయింట్ను సుకుమార్ కాపీ కొట్టాడు అని, దాని ప్రకారమే రంగస్థలం క్లైమాక్స్ను చిత్రీకరించాడని ఎం.గాంధీ అనే రచయిత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ఎం. గాంధీ ఫిర్యాదు అందుకున్న అసోసియేషన్ వివరణ అడిగింది. తన సినిమాపై వచ్చిన ఆరోపణలకు సుకుమార్ స్పందిస్తూ.. రంగస్థలం క్లైమాక్స్ను తను ఎక్కడా కాపీ కొట్టలేదు అని స్పష్టం చేశాడు.
కాకపోతే..1979లో వచ్చిన రజనీకాంత్ సినిమా ‘ధర్మయుద్ధం’ ప్రేరణ కొంత ఉందని సుకుమార్ చెప్పాడు. ఆ సినిమాను చూసినప్పటి నుంచి విలన్ను హీరో కాపాడి, తర్వాత చంపడం అనే పాయింట్తో సినిమా తీయాలనే ఆలోచన తనకు ఉందంటూ సుకుమార్ క్లారిటీ ఇచ్చారు.