ఈ మద్య తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమాలు రిలీజ్ కి ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొని థియేటర్లో దర్శనమిస్తున్నాయి. లింగ సినిమా నుంచి కబాలి వరకు ఎన్నో వివాదాలు చెలరేగాయి. కబాలి సినిమా అయితే రిలీజ్ కి ముందే నెట్ లో దర్శనమివ్వడం పెను సంచలనం రేపింది. తాజాగా పా రంజీత్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాపై కూడా ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో ఉన్నారు..రజినీకాంత్. కాకపోతే..మొన్న తుత్తుకూడి లో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులను పరామర్శించారు. అంతే కాదు వారికి ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు రజినీకాంత్. ఇదిలా ఉంటే..ఈ మూవీపై కర్ణాటకలో అక్కడి ఫిలిం ఛాంబర్ నిషేధం విధించింది.
జూన్ ఏడో తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా, అక్కడ మాత్రం నిషేధం కారణంగా విడుదల కావడం లేదు..తమిళనాడు, కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదంపై రజనీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సినీ హీరో, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తీవ్రంగా మండిపడ్డాడు.
విశాల్ ‘కాలా ’ సినిమాను రాజకీయ కోణంలో చూడవొద్దని..ఇది సినీ అభిమానులకు సంబంధించిన అంశం అని అన్నారు. సినిమాను నిషేధించడమనేది భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని చెప్పాడు. ఈ విషయంపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ పునరాలోచించాలని కోరాడు.