ఈ మద్య సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త అయినా ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ పోటీదారు అర్మాన్ కోహ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లి తన సహజీవన భాగస్వామి, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను తీవ్రంగా హింసించగా, ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ముంబై పరిధిలోని శాంతాక్రజ్ పోలీసుల కథనం ప్రకారం, గత మూడేళ్లుగా నీరు, అర్మాన్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా ఆర్థిక సంబంధ అంశాల్లో సమస్యలున్నాయి. గోవాలోని ఓ విల్లా అమ్మకం విషయంలో విభేదాలు తారస్థాయికి చేరగా, ఆదివారం రాత్రి, ఉన్మాదిలా మారిన కోహ్లీ, నీరూను జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు.
అర్మాన్ కొట్టిన దెబ్బలకు దాదాపు చనిపోయే పరిస్థితికి చేరుకున్న నీరూ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డా అర్మాన్ వినలేదు. తాను కొట్టిన దెబ్బలకు నీరూ చనిపోయిందని భావించిన అర్మాన్ అక్కడ నుంచి పారిపోయాడు. చాలాసేపటికి తేరుకుని ఆసుపత్రికి చేరుకున్న ఆమె, పోలీసులకు విషయాన్ని తెలిపింది.
అర్మాన్ పై ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వేళ, కో-పార్టిసిపెంట్ తనీషా ముఖర్జీతో రొమాన్స్ చేసిన అర్మాన్, తీవ్ర దుమారాన్ని రేపగా, హౌస్ నుంచి అతన్ని గెంటేసిన సంగతి తెలిసిందే.