బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. అదే స్థాయిలో ఎన్నో వివాదాలు కూడా చుట్టు ముట్టాయి. ఆ మద్య సల్మాన్ ఖాన్ ని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని..రేస్ 3 షూటింగ్ సమయంలో పోలీసులు సల్మాన్ ఖాన్ ని షూటింగ్ నుంచి భద్రంగా తీసుకు వెళ్లిన సంఘటన జరిగింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్పై బిష్టోయ్ తెగ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందా ? ఇందుకోసం సల్మాన్ ఖాన్ హత్యకు గ్యాంగ్ స్టర్లు యత్నిస్తున్నారా ? పోలీసుల కన్నుగప్పేందుకు హైదరాబాద్ నుంచి ప్లాన్ అమలు చేశారా ? గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారా ? అంటే అవుననే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు.
హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్వాంటెడ్గా ఉన్న గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా ను ఇటీవల సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన సంపత్ పేరు చెప్తే చాలు ఈ మూడు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతారు. కరడుగట్టిన మరో నేరస్థుడు లారెస్స్ బిష్టోయ్ ప్రధాన అనుచరుడిగా ఉన్న సంపత్ దాదాపు 12 సంచలన హత్యకేసుల్లో నిందితుడు. గ్యాంగ్ స్టర్ను సంపత్ నెహ్రూను వలపన్ని పట్టుకున్న పోలీసులు .. విచారణలో ఈ విషయాలను నిర్ధారించారు. అరెస్ట్ సమయంలో సంపత్ నెహ్రూ వినియోగించిన ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి ఫోటోలతో పాటు చుట్టుపక్కల ఉండే రోడ్డు, సీసీ కెమెరాల వివరాలు, భద్రతకు సంబంధించిన ఫోటోలను గుర్తించిన పోలీసులు లోతుగా విచారణ జరిపారు. కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ఖాన్ను హత్య చేస్తామని బిష్ణోయ్ వర్గం ఇది ప్రకటించిన నేపధ్యంలో ఈ రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. మరింత లోతైన దర్యాప్తు కోసం సంపత్ నెహ్రూను హర్యానా పోలసులకు అప్పగించిన ఉన్నతాధికారులు కేసు విచారణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.