టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న పవన్ కళ్యాన్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. నటుడిగా మంచి హోదాలో ఉన్న పవన్ కళ్యాన్ ఇప్పుడు సినిమాల్లో నటిస్తూనే..రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారు. ప్రస్తుతం ‘జనసేన’ పార్టీ తరుపు నుంచి ఆయన ప్రజాపోరాటం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల వరకు పార్టీ ప్రతిష్ట పెంచేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ మద్య ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా అమరావతి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. విజయవాడలోని పటమట ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కల్యాణ్, ఈ ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ భార్య అన్నా లెజినోవా, పవన్, రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా తదితరులు పాల్గొన్నారు. తన పెద్ద కుమారుడిని వెంట బెట్టుకుని పవన్ గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
కాగా, పవన్ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో దాదాపు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ తన ఇంటిని, కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతోనే, అద్దె ఇల్లు తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇక పవన్ అద్దెకు తీసుకున్న ప్రాంతం చుట్టుపక్కల పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ ఆ ఇంట్లో ఉన్నంత సేపూ ప్రత్యేక సెక్యూరిటీని, 24 గంటల కాపలాను ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.