తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వస్తున్న చిత్రాలకు పాత టైటిల్స్ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రం రాబోతుంది. ఒకప్పుడు చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో విజేత ఒకటి. నాగశౌర్య హీరోగా కొత్త దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
తాజాగా నాగౌశర్య కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. కాకపోతే ఆయన మాత్రం బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’తో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నాగశౌర్యకి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. బాలకృష్ణ నటించిన ఆ సినిమాలో శోభన, నిరోషలు హీరోయిన్లుగా నటించారు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయన గతంలో బాలకృష్ణతో ‘పైసా వసూల్’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చనువుతోనే తన చిత్ర టైటిల్ పెట్టుకోవడానికి బాలయ్య అంగీకరించారని సినీ వర్గాల సమాచారం. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనుంది.