ప్రస్థుత పరిస్థుతులలో రాజకీయ పార్టీలు తమ మనుగడ సాధించడానికి నిధులు చాల అవసరం. నాయకుల ఉపన్యాసాలలో ఉండే విలువలు ఎన్నికల పోరాటంలో వాస్తవంగా ప్రదర్శించడం చాల కష్టం. ఇలాంటి పరిస్థుతులలో ఇప్పటికే ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్న పవన్ కళ్యాణ్ ‘జనసేన’ తన పార్టీ మనుగడ కోసం త్వరలో చేప్పట్టబోతున్న ‘డైన్ విత్ పవన్’ కార్యక్రమం సంచలనంగా మారింది.
జనసేన’ ను పూర్తి స్థాయిలో చైతన్యవంతం చేసి రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల్లోనూ పోటీ చేస్తానంటూ పదేపదే ప్రకటనలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ‘జనసేన’ నిధుల సమస్యలకు ఈ ‘డైన్ విత్ పవన్’ కార్యక్రమం ఒక సమాధానం అని అంటున్నారు. ‘డొనేట్ ఫర్ జనసేన’ అంటూ స్పెషల్ డ్రైవ్ చేపట్టే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఇక తరుచు తన అభిమానులతో స్పెషల్ డిన్నర్ లలో కలవబోతున్నట్లు సమాచారం.
‘మార్పు కోసం రాజకీయం మీరు కూడా ఒక చెయ్యి వెయ్యండి’ అంటూ ఒక ప్రత్యేక స్లోగన్ తో ఈకార్యక్రమానికి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను కూడ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ డిన్నర్ కు వచ్చే పవన్ అభిమానుల నుండి విరాళాలు సేకరించి ‘జనసేన’ నిధుల సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించాలి అన్న ఆలోచనలలో పవన్ ఉన్నట్లు టాక్. గతంలో 2014 ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇలాంటి కార్యక్రమం చేపట్టి ‘మాతో కలిసి భోంచేయండి.. పార్టీ కోసం 20 వేలు విరాళం ఇవ్వండి’ అనే నినాదంతో అప్పట్లో ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కొనసాగే ఈపద్ధతిని కేజ్రీవాల్ భారత రాజకీయ పార్టీలకు పరిచయం చేసారు. అయితే ఈ కార్యక్రమానికి కొద్దిగా మార్పులు చేసి ‘డైన్ విత్ పవన్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు టాక్. అయితే ఇలాంటి కార్యక్రమాలు వివాదాస్పదం అయ్యే ఆస్కారం ఉండటంతో ఈకార్యక్రమం గురించి పవన్ ప్రస్తుతం లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఎంపరర్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ అడిగితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండే విరాళాలుగా భారీ మొత్తాలు వచ్చే ఆస్కారం ఉన్నా అలా కాదనుకుని కేవలం తన వీరాభిమానులతో పవన్ మనసులో ఉన్న ‘డైన్ విత్ పవన్’ ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి..