జబర్ధస్త్ కామెడీ షోతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ తర్వాత వెండితెరపై తనదైన కామెడీ పండించాడు. ఈ మద్య కామెడియన్లుగా వచ్చి హీరోలుగా మారిన వారిలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలతో పాటు షకలక శంకర్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘శంభో శంకర్’సినిమాలో నటించాడు. ఈ సినిమా ద్వారా శంకర్ స్నేహితుడు ఎన్.శ్రీధర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆర్.ఆర్.పిక్చర్స్, ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ను మూట గట్టుకుంది.
అంతే కాదు సినిమా విడుదలకు ముందు శంకర్ మాట్లాడిన ఆ మాటలే ‘శంభో శంకర’కు హైప్ను తీసుకొచ్చాయి. ‘త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లా, దిల్ రాజు ఈ సినిమా తీయమని అడిగా’ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శంకర్ చెలరేగిపోయాడు. ‘వాళ్లంతా కథ బాగుంది తీద్దాం అన్నారు కానీ నన్ను హీరోగా అంటే వెనకడుగు వేశారు’ అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఇదంతా సినిమాపై హైప్ తీసుకు రావడానికే చేశానని క్లారిటీ ఇచ్చినా..అప్పటికే సోషల్ మీడియాల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా వచ్చినా శంకర్ లా దూకుడు గా ప్రవర్తించలేదని అన్నారు. మరోవైపు సినిమాపై నెగిటీవ్ టాక్ వచ్చినా.. షకలక శంకర్ ఉన్న క్రేజ్ తో కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయని అంటున్నారు. రివ్యూలు ఎలా ఉన్నా ‘శంభో శంకర’ తొలిరోజు రూ.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మొత్తం 585 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.2,05,18,125 వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ను కూడా శనివారం విడుదల చేశారు.