ఈ మద్య స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సెల్ఫీల జోరు బాగా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎక్కడ బడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం సోషల్ మాద్యమాల్లో అప్ లోడ్ చేయడం సర్వసాధారణం అయ్యింది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్..క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు.
ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థ వేడుక దీనికి వేదికైంది. ఈ వేడుకకు హాజరైన సచిన్, షారూక్ మహారాష్ట్ర వెడ్డింగ్ టోపీలు పెట్టుకుని సెల్ఫీ దిగారు. అయితే ఆ సెల్ఫీ ని సచిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. `జబ్ ఎస్ఆర్కే మెట్ ఎస్ఆర్టీ` అంటూ కామెంట్ కూడా చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజాగా ఈ ఫోటోపై షారూక్ స్పందించాడు. `సాధరణంగా నేను ఫోటోలను దాచుకోను. కానీ, ఈ ఒక్క ఫోటోను మాత్రం జీవితాంతం దాచుకుంటా. గొప్ప వ్యక్తితో దిగిన ఈ ఫోటో జీవితాంతం దాచుకోవాల్సిన మధుర జ్ఞాపకం` అని షారూక్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ ఫోటో అటు క్రీడా, సినిమా అభిమానులను ఎంతో సంతోష పరుస్తుంది.