టాలీవుడ్ పై నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. చిన్న స్థాయి నటుడిగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన నవ్వుల రాజేంద్రుడు ...ఆ తర్వాత కామెడీ చిత్రాల్లో స్టార్ హీరోగా ఎదిగారు. తన కామెడీ టైమింగ్ తో డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తెరపై హాస్య కథలను పరుగులు తీయించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కథానాయకుడు రాజేంద్రప్రసాద్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పారు.
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నేను గోల్డ్ మెడల్ సాధించిన తరువాత ఎన్టీఆర్ గారు నన్ను అభినందించారు. ఎన్టీఆర్ ను కలుసుకున్న నేను మొదటిసారిగా ఆయన మాటలు విని షాక్ తినడమే కాదు..వారం రోజులు నిద్ర, తిండి సహించలేదు. "చూడు ప్రసాద్ .. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఒక విషయాన్ని నువ్ ఫాలో కావాలి. అది నువ్వు ఫాలో అయితే నిలబడతావు, లేదంటే లేదు" అన్నారు.
'చెప్పండి' అన్నాను నేను. పౌరాణిక వేషాలు అనగానే వెంటనే రామారావు అంటారు .. కుటుంబ నేపథ్యం కలిగిన సాంఘిక చిత్రాలనగానే బ్రదర్ నాగేశ్వరరావు గారు వున్నారు. అట్లాగే డిష్యుం .. డిష్యుం సినిమాలు చేయాలంటే తమ్ముడు కృష్ణ వున్నాడు. రొమాంటిక్ సినిమాలు చేయాలంటే శోభన్ బాబు వున్నాడు. మరి నువు దేనికి పనికొస్తావో చెప్పు? అన్నారు. ఆ మాటకి ఒక వారం రోజుల పాటు అన్నం తినబుద్ధి కాలేదు" అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన అన్న మాటలు నేను స్ఫూర్తిగా తీసుకొని నాకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకొని హాస్య నటుడిగా ఈ స్థాయికి ఎదగగలిగానని అన్నారు.