తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ మొదటి వారం చప్పగా సాగినా..రెండో వారం సంజన ఎలిమినేట్ అయిన తర్వాత కాస్త రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలో రెండో వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ కావడంతో కామన్ మాన్ ని టార్గెట్ చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ తర్వాత నటుడు కిరీటి, యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యారు. తాజాగా గురువారం జరిగిన ‘మంచి-చెడు’ టాస్క్లో భాగంగా కంటెస్టెంట్లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్లోని వస్తువులను ధ్వంసం చేశారు.
అయితే కౌశల్పై భానుశ్రీ చేసిన ఆరోపణ సెన్సేషన్ అయ్యాయి. టాస్క్లో భాగంగా కౌశల్ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. తొలి నుంచి కౌశల్ అంటే గిట్టని తేజస్వీ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ‘వాడి బుద్ధే అంతా’ అంటూ విరుచుకుపడింది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న గీతామాధురి వెంటనే స్పందిస్తూ.. ‘ఆ ఆరోపణలు అవాస్తవం.. దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయకండి’ అంటూ సొంత టీమ్ సభ్యులైన భాను, తేజస్వీలను హెచ్చరించింది.
దాంతో ఆ ఇద్దరూ కామ్ కాగానే కౌశల్ ఊపిరి పీల్చుకున్నాడు..ముందు తిట్టాల్సింది తిట్టి ఇప్పడు సారీ అడిగితే ఏం లాభం అంటూ వాపోయాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్లో ఉండటంతో ఆమె ఎదో ఒకటి చేసి.. ప్రేక్షకులను ఆకర్షించాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గురువారం జరిగిన టాస్క్ లో భానుపై ఉన్న అభిమానాన్ని తుడిచివేసిందని కొందరు ఘాటుగానే కామెంట్ చేయగా.. ఆటకోసం ఒకరిపై బట్టకాల్చేయడం ఏంటని మరికొందరు మండిపడుతున్నారు. మరోవైపు హౌజ్ లో కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్న తేజస్వీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను చూడలేకపోతున్నామని, దయచేసి ఎలిమినేట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు.