గత కొంత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీనియర్ నటి రీటా భాదురి(82) ఇక లేరు. బాలీవుడ్లో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో నటించిన రీటా.. గత కొంతకాలంగా వయసురిత్యా సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ‘రాజీ’ ఫేమ్, నటుడు శిశిర్ శర్మ తన ఫేస్బుక్లో తెలియజేశారు. ఆమె మరణం తనను కలచివేసిందని ‘రాజీ’ నటుడు శిశిర్ శర్మ పేర్కొన్నారు. ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని పేర్కొన్న ఆయన తమలో చాలామందికి ఆమె అమ్మని అన్నారు. ‘విల్ మిస్ యూ మా’ అని ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. కబీ హాన్ కబీ నా, క్యా కహెనా, దిల్ విల్ ప్యార్ వ్యార్, మై మాధురిదీక్షిత్ బన్నా చాహితీ హూ.. తదితర చిత్రాలతో రీటా మంచి గుర్తింపు పొందారు.
హిందీతోపాటు పలు గుజరాతీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవటంతో.. బుల్లితెర వైపు ఆమె తన దృష్టిసారించారు. హస్రాతేన్, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, కిచిడీ, ఏక్ నయీ పెహ్చాన్, అమనత్, కుమ్కమ్ తదితర సీరియళ్లలో ఆమె నటించారు. గత పది రోజులుగా ఐసీయూలోనే ఉన్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. 20 వరకు టీవీ షోలతోపాటు సూపర్ హిట్ సినిమాలైన రాజా, జూలీ, బేటా, హీరో నంబర్ 1, విరాసత్ తదితర చిత్రాల్లోనూ నటించారు.