తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరో సూర్య. గజినీ చిత్రంతో తెలుగు లో మంచి పేరు తెచ్చుకున్న సూర్య తర్వాత సింగం సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఇండస్ట్రీలో సూర్య రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా హీరోనే అనిపించుకుంటున్నారు. ఆ మద్య వైజాగ్ లో హుదూద్ తుఫాన్ బాధితులకు నలభై లక్షులు విరాళం ఇచ్చారు. ఎన్నో వందల మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు..ఎన్నో గుప్త దానాలు చేస్తున్నారు.
ఒక వైపున నిర్మాతగానూ .. మరో వైపున హీరోగాను సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల కార్తీ హీరోగా ఆయన తమిళంలో 'కడైకుట్టి సింగం' సినిమాను నిర్మించాడు. తెలుగులో ఈ సినిమా 'చినబాబు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం మంచి విజయం అందుకున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై సూర్య మాట్లాడుతూ .. తమిళనాడులోని రైతుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. తన 'అగరం' ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. సూర్య మంచి మనసుకు అందరూ ఎంతో సంతోషించారు.