సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా మంచి పేరు తెచ్చుకుంది హాట్ యాంకర్ అనసూయ. గతంలో సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు..‘రంగస్థలం’ సినిమాలో అనసూయ నటనకు పాత్రకు మంచి పేరు వచ్చింది. ఓ వైపు జబర్ధస్త్ కామెడీలో యాంకర్ గా చేస్తూనే పలు టీవి ఛానల్స్ లో బిజీగా ఉంటున్న అనసూయ వెండితెరపై కూడా తన టాలెంట్ చూపిస్తుంది.
తాజాగా పోచంపల్లిలో సినీనటి, ప్రముఖ యాంకర్ అనసూయ సందడి చేసింది. చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె పోచంపల్లిలోని మహామ్మాయి కాలనీలోని పలు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. అక్కడ నూలు, చిటికి, రంగులద్దకం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. తాను కూడా పోచంపల్లి ఆడపడుచునని, తనకు పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని అనసూయ గుర్తుచేశారు.
చేనేత కార్మికులతో ముచ్చటిస్తూ తాను పోచంపల్లి సుందర్రావు కూతురునని పరిచయం చేసుకున్నారు. పోచంపల్లి నా జన్మభూమి అని, తాను చిన్నపుడు పోచంపల్లి చేనేత వస్త్రాలు వేసుకుని స్కూల్కు వెళ్తే బెడ్షీట్ ధరించి వచ్చిందని తోటి స్నేహితులు హేళన చేశారని చెప్పారు. కానీ నేడు వాళ్లు ముఖం చాటేసుకుంటున్నారని తెలిపారు. చేనేత కళను ప్రోత్సహించే ఏ కార్యక్రమానికైనా తాను రెడీ అని అన్నారు.
చేనేత వస్త్రాలంటే కేవలం చీరలు అని అపోహ ఉంటుంది. కానీ నేటితరం యువత ధరంచే విధంగా అన్ని రకాల ఇక్కత్ వస్త్రాలు ఎంతో స్టైలిష్గా ఉన్నాయని చెప్పారు. పోచంపల్లి టూరిజం పార్క్లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘చేనేత పండుగ చేద్దాం.. చేనేత కళాకారులను ఘనంగా సన్మానిద్దాం’ అనే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు.