ఒకప్పుడు సినిమా థియేటర్స్ కి వెళితే..ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఇంట్రవెల్ తో నచ్చింది కొనుక్కొని తింటూ ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు..థియేటర్లకు వెళితే బయట ఏదైనా కొనుక్కోవాలంటే..టిక్కెట్ కన్నా అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళితే..టిక్కెట్ కన్నా డబుల్ రేట్లతో తినుబండారాలు దొరుకుతున్నాయి. కోకా కోలా, పెప్సీ, పాప్ కార్న్, శాండ్ విచ్, బర్గర్, వాటర్ బాటిల్… సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్లలో ఏది కొనాలని అనుకున్నా అక్కడి రేట్లు చూసి గుండెదడ రావడం ఖాయం. బయట మార్కెట్ ధరలకు, థియేటర్లలో అమ్మే ధరలకు అసలు పొంతన వుండదు.
మహరాష్ట్రలో థియేటర్లకు షాక్ ఇస్తూ..తిను బండారాలు ఇంటి నుంచి తీసుకు పోయే సదుపాయం కల్పించారు. ఒకవేళ థియేటర్లో అమ్మితే ఎంఆర్ పి రేటు ప్రకారం అమ్మాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో కూడా ఇదే జీవో ను అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ రేటుకు అమ్మినట్టు తెలిస్తే అంతే సంగతులు. తినుబండారాలు, శీతల పానీయాలు అన్నిటినీ ఎమ్మార్ఫీ ధరలకు అమ్మాలని, లేనిపక్షంలో ఎక్కువ ధరలకు విక్రయించే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర తూనికల కొలతల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని విధివిధానాలు రూపొందించారు.
ఆగస్టు 1వ తేదీ ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎంఆర్పీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా… నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై భారీ జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష విధించేలా తూనికల కొలతల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముచ్చెమటలు పట్టించిన అకున్ సబర్వాల్ చేతిలో ఈ తూనికల కొలతల శాఖ వుంది. ఆయన ప్రతి జిల్లాకు ఈమేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అధిక ధరలకు టిక్కెట్ అమ్మినా..ఆహార పదార్థాలు అమ్మినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 180042500333 కి కాల్ చేసి, లేదా 7330774444 నంబర్ కు వాట్సాప్ చేసి కంప్లయిట్ ఇవ్వవచ్చు అని అధికారులు అంటున్నారు.