క్రేజీ యంగ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ తనని తాను రెబల్ గా భావిస్తూ ఆవిధంగానే తన ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందిన ‘గీతగోవిందం’ ఆడియో సక్సస్ అయినా ఆమూవీలో విజయ్ దేవరకొండ పాడిన పాట పై తీవ్ర వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
‘వాట్ ది ఎఫ్’ అనే ఈపాటలోని పదాలు చాలామంది మనోభావాలు దెబ్బతీసిన నేపధ్యంలో యూట్యూబ్ ఈపాటను బ్లాక్ చేసింది. అయితే ఈసినిమా దర్శక నిర్మాతలు మాత్రం తమను తాము కవర్ చేసుకుంటూ తాము ముందుగా ఈపాటను తమంత తాముగా తొలిగించామని చెపుతున్నారు. ఈ లిరిక్ లోని పదాలు మార్చి మళ్ళీ విజయ్ తోనే ఆపాట పాడించారు.
అయితే విజయ్ దేవరకొండ పాట పై ఇప్పుడు సరికొత్త విమర్శలు వస్తున్నాయి. డైలాగ్స్ వరకు ఓకే కానీ పాటలు పాడి ఖూనీ చేయొద్దంటూ చాలామంది ఓపెన్ గానే విజయ్ కు సలహాలు ఇవ్వడం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జరుగుతున్న పరిణామాలను గ్రహించిన విజయ్ దేవరకొండ ఇక పై పాటలు పాడనని అంటూ పాటలు పాడడం తన వృత్తి కాదు అంటూ క్షమించండి అంటూ తన విమర్శలకు ధీటైన సమాధానం ఇస్తున్నాడు.
దీనితో అసలు ‘గీతగోవిందం’ విడుదల అయ్యే సమయానికి విజయ్ పాటను ఉంచాలా తీసివేయాలా లేదంటే ఇదే పాటను మరొక గాయకుడి చేత పాడించాల అన్న ఆలోచనలలో ఈసినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్. దీనికితోడు ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అనేపాట ట్యూన్ ను ‘గీతగోవిందం’ టీజర్ లోకి వాడుకోవడానికి ఆ ట్యూన్ పై రైట్స్ ఉన్న ఏవియమ్ సంస్థకు లక్షా డెభైవేలు ఇవ్వవలసి వచ్చిందని అంటున్నారు. ఇలా రకరకాల కారణాలతో ‘గీతగోవిందం’ మూవీ ప్రతిరోజు ఒక సంచలన వార్తకు నాంది పలుకుతోంది..