మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.. సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ తీస్తున్న సినిమా ఇది. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వంలో.. బోహ్ర బ్రదర్స్ దీన్ని నిర్మిస్తున్నారు.
2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన డా. మన్మోహన్ సింగ్ ఇతివృత్తంతో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఆ మద్య ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ లుక్ లో అనుపమ్ ఖేర్ అతికినట్టు సరిపోయారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. తాజాగా ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు విజయ్ గట్టీని జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ అరెస్ట్ చేసింది.
విజయ్ 34 కోట్ల రూపాయల జీఎస్టీ మోసానికి పాల్పడ్డాడు. నకిలీ ఇన్వాయిస్ ద్వారా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్ను విజయ్ కి చెందిన కంపెనీ వీఆర్జీ డిజిటల్ క్లయిమ్ చేసుకుంది. రూ.266 కోట్ల విలువైన యానిమేషన్, మాన్వపర్ సర్వీసులను హారిజోన్ కంపెనీకి వాడినట్టు వీఆర్జీ డిజిటల్ నకిలీ ఇన్వాయిస్ల్లో చూపించింది. ఇలా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్ను మోసపూరితంగా వీఆర్జీ డిజిటల్ పొందింది. దీంతో ఈ రెండు కంపెనీలని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. విజయ్ను జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతుంది.
అయితే విజయ్, ప్రముఖ మహారాష్ట్ర వ్యాపారవేత్త రత్నాకర్ గట్టీ కొడుకు. విజయ్ తండ్రి రత్నాకర్ కూడా రూ.5500 కోట్ల ఇంజనీరింగ్ స్కాం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర, మన్మోహన్ సింగ్గా అనుపమ్ ఖేర్ , దివ్యా సేథ్, మన్మోహన్ భార్య గుర్షరణ్ కౌర్ పాత్రను పోషిస్తున్నారు.