తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి. మొదటి సారిగా సినీతారలపై బయోపిక్ లు వస్తున్న నేపథ్యంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ చిత్రంతో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించింది. ఆ పాత్రలో ఆమె నటించిందీ అనడం కన్నా..జీవించిందని చెప్పొచ్చు..అందుకే విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.
తాజాగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. మహానటులు ఎన్టీఆర్ జీవితంలో సినిమా, రాజకీయా కోణంలో తీస్తున్నారు..అందుకే ఇందులో నటీనటులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. అలాగే చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు.
కాగ తాజాగా ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాత్ర కోసం మలయాళ హీరోయిన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మద్య నాగ చైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలోని హీరోయిన్ మంజిమ మోహన్, చంద్రబాబు సతీమణిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నారా భువనేశ్వరి పాత్రలో కనిపించున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.