నేడు ఆశేషు హిమాచలం 130 కోట్ల భారతీయుల స్వాతంత్ర కాంక్షకు ప్రతీకగా ఎర్రకోట పై మన భారతదేశ స్వాతంత్ర కీర్తిని నేటి తరానికి తెలియ చేస్తూ ఎగురుతున్న మువ్వన్నెల జెండా కీర్తి ప్రతి భారతీయుడుకి స్పూర్తిని కలిగించే సందర్భం. 1857 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్ర పోరాటాలలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. ఈ స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన అనేక సంఘటనలకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ ఆశక్తిని కలిగిస్తూనే ఉంటాయి.
నిజానికి భారతదేశం ఒకే జాతి కాదు. బ్రిటిష్ వారు విభిన్న భాషలు, సంస్కతులు ఉన్న ప్రాంతాలను ఒకటిగా చేసి ఇచ్చిన స్వాతంత్ర్యం మనది. దీనివలన స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు పూర్తి అయి 72 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నా ఇంకా ఎన్నో సమస్యలు అవరోధాలు మన భారత జాతిని వెంటాడుతూనే ఉన్నాయి. భారత స్వాతంత్య్రోద్యమం గురించి చాలా మంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్య్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని కొన్ని విషయాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగడం ఖాయం.
ఇదే రోజు భారత్తో పాటు కొరియా, కాంగో, బెహ్రయిన్, లీచెన్స్టీన్ దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ అలనాటి మన నాయకులకు సూచించడం వెనుక ఒక కారణం ఉంది అని అంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ బ్రిటీష్ ప్రభుత్వానికి ఈ తేదీన లొంగిపోవడంతో ఆతేదీ బ్రిటీష్ గొప్పతనాన్ని చాటుతుంది కాబట్టి అదేరోజును లార్డ్ మౌంట్ బాటెన్ సూచించారు అని అంటారు. మరొకటి ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈసందర్భంలో గుర్తుకు చేసుకోవాలి. ఇప్పుడు మనం జాతీయ గీతంగా పరిగణిస్తున్న ‘జన గణ మన' ను రబీంద్రనాథ్ ఠాగూర్ రచించిన విషయం తెలిసిందే.
అయితే ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ ఐదవ జార్జ్ గౌరవార్థం ఠాగూర్ రంచించాడు అని చరిత్రకారులు అంటారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు అన్న వాదన ఉంది. అయితే స్వాతంత్రం వచ్చాక జాతీయ గీతంగా ‘వందేమాతరానికి’ బదులు ‘జన గణ మణ’ ను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్లో వాయించడానికి వందేమాతరం కన్నా ‘జన గణ మణ’ అయితే సులభంగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ భావించారట.అదేవిధంగా భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ ర్యాడ్క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండా ర్యాడ్ క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు అన్న వాదన ఉంది. దీనివాలనే ఇండియా పాకిస్తాన్ ల మధ్య మొదటి నుండి శత్రుత్వం ఏర్పడిందని ఈవిషయం పై తాను చనిపోయేంతవరకు ర్యాడ్క్లిఫ్ బాధపడుతుండేవారని చరిత్రకారులు చెపుతూ ఉంటారు. ఇలా ఎన్నో హడావిడి నిర్ణయాలతో మనకు స్వాతంత్రం లభించి ఎన్నో సవాళ్ళను గత 71 సంవత్సరాలుగా ఎదుర్కుంటూనే ఉన్నా ‘మేరా భారత్ మహాన్ ‘ అన్న నినాదం స్పూర్తితో భారత జాతి ప్రపంచానికి తలమానికంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈనాటి స్వాతంత్ర ఉషోదయాన్న భారతీయులందరికీ ఇండియన్ హెరాల్డ్ శుభాకాంక్షలు..