ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ తారలపై వచ్చిన మహానటి, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘సంజు’ ఘన విజయం సాధించారు. ఇక రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ బయోపిక్ లు కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రూపుదిద్దకుంటున్నది.
తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు వెన్నెముకగా నిలిచారు తప్ప, వెన్నుపోటుదారుడిగా కాదన్న కథాంశంతో వెంకట రమణ దర్శకత్వంలో గండికోట రాజేంద్ర నిర్మాతగా తెరకెక్కుతున్న 'చంద్రోదయం' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిర్మిస్తున్న ‘చంద్రోదయం’ త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని అభిమానుల ముందుకు రాబోతుంది. తాడేపల్లి గూడెం మండల పరిధిలోని పెద తాడేపల్లి సమీపంలో ఈ చంద్రబాబు బయోపిక్ లో ఎన్టీఆర్ సన్నివేశాలను చిత్రీకరించారు. మరికొంత షూటింగ్ నారావారిపల్లెతో పాటు హైదరాబాద్ లోని మాదాపూర్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నట్టు తెలిపారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా గురించి ఇప్పటికే చంద్రబాబుకు వివరించామని అన్నారు. నెలాఖరుకు సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తామని, సెప్టెంబర్ తొలి వారంలో ఆడియోను విడుదల చేసి, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. బాలీవుడ్ నటులు రఘువర్మ, పల్లవి జోష్, నాగినీడు తదితరులు చిత్రంలో నటించారని తెలిపారు. ఇప్పటికే చిత్రం టీజర్ ను సెక్రటేరియేట్ లో చంద్రబాబు నాయుడికి చూపించామని వెల్లడించారు. ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు.