తెలుగు రాష్ట్రాల్లో రోల్ రైడా అంటే ర్యాప్ సింగర్ అని తెలుసు. గతంలో కొన్ని వీడియోలతో యూత్ కి బాగా కనెక్ట్ అయిన రోల్ రైడా. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్ ఇప్పటి వరకు అన్ని టాస్క్ ల్లో తనదైన స్టైల్ తో అందరినీ మెప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా రోల్ రైడా, మనీషా యేరాబత్తిని పవర్ఫుల్ ర్యాప్ సాంగ్ ‘అరుపు’ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
కమ్రన్ కంపోజ్ చేసిన ఈ పాట వీడియోకు హరికాంత్ గునమగరి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో దుమ్మురేపుతుంది. విడుదలైన నాలుగు రోజుల్లో 8.5 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోలో రోల్ రైడా స్వయంగా నటించారు. ‘పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు.. చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని’ అంటూ రోల్ రైడా గొంతుతో వీడియో ప్రారంభమవుతుంది.
‘లోకం మొత్తం నాదే అసలు.. నా లోపలే జీవం మొదలు.. అయ్యా నేడే మీకే అలుసు.. నా కోపమే మీకేం తెలుసు.. పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి.. పెంచా పెంచా నాపై దుమికే ఈ రాక్షసుల్లా’ అంటూ వచ్చే మనీషా వోకల్ అద్భుతంగా ఉంది. మనీషా ఆలపించిన ఈ లిరిక్స్ను కృష్ణకాంత్ రచించారు. ఇక రోల్ రైడా ఆలపించిన ర్యాప్ లిరిక్స్ను ఆయనే రాసుకున్నారు.
సమాజంలో మహిళలపై పెరుగుతున్న అకృత్యాలపై ఈ ర్యాప్ వీడియో మహిళలను బాగా ఆకర్షిస్తుంది. ఈ మేరకు యూట్యూబ్లో వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ‘బిగ్ బాస్’లో రోల్ రైడాను చూసి ఇప్పటి వరకూ ట్రోల్ చేశామని, కానీ ఇప్పుడు ఆయనపై గౌరవం పెరిగిందంటూ కొంత మంది కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ వీడియోను కాలా మీడియా వర్క్స్ పతాకంపై సునీల్ గడ్డమేది, శ్రీని శ్రీగధ నిర్మించారు.