తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఎన్నో రొమాంటిక్ చిత్రాల్లో నటించారు. తర్వాత యాక్షన్ తరహా చిత్రాల్లో నటించి కింగ్ నాగార్జున గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాగార్జున నట వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా రాణిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాధాకృష్ణ ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటించినట్లు సమాచారం. గతంలో నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం అందించింది కేరళకు చెందిన గోపి సుందర్ కావడంతో రీ రికార్డింగ్ సమయానికి వరదలు రావడం.. దీంతో రీరికార్డింగ్ వాయిదా పడటం చకచకా జరిగిపోయాయి.
ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు నాగార్జున బర్త్డే. ఈ సందర్భంగా శైలజారెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శైలజారెడ్డిగా రమ్యకృష్ణ అలరించనున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అత్తా, అల్లుడు చాలెంజ్ సినిమాలు ఎన్నో వచ్చాయి..మరి ఈ చిత్రం కూడా అదే లీస్ట్ లోకి వెళ్తే మాత్రం సూపర్ హిట్ ఖాయం అంటున్నారు అక్కినేని అభిమానులు.