సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు హరికృష్ణ ఈరోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరిచూపు కోసం హరికృష్ణ నివాసానికి ప్రముఖులు తరలివస్తున్నారు. తాజాగా నందమూరి హరికృష్ణ భౌతిక కాయాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి ఛలించిపోయారు. నందమూరి హరికృష్ణ విషాద మరణం చాలా దురదృష్టకరమని.. దుర్దినం అని ప్రముఖ నటుడు చిరంజీవి తన బాధన వ్యక్తం చేశారు.
మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం, మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ, తన సోదర సమానుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని, చాలా బాధగా ఉందని, మనసు కలచివేస్తోందని అన్నారు. కలిసిన ప్రతిసారి సరదాగా జోక్స్ వేస్తూ నవ్వించేవారు.
అటువంటి మనిషి ఇలా మధ్యలోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఊహించలేదు. ఈ బాధను తట్టుకోవడానికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ తెలిపారు. కాగా, చిరంజీవితో పాటు తనయుడు హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు.