అశేష అభిమానులు వెంట రాగా.. నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది.  కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది.పసుపు రంగు బంతి పూలతో అలంకరించిన వాహనంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పాడె ముందు నడుస్తుండగా... ముఖ్యమంత్రి చంద్రబాబు పాడెను తన కుడి భుజంపై మోశారు. పాడెకు ముందు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారు.

అనంతరం భౌతకకాయాన్ని అంతిమయాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలోకి చేర్చారు. తన నివాసం నుంచి మహాప్రస్థానానికి హరి అంతిమయాత్ర మొదలైంది.  అంతిమ యాత్రలో టీడీపీ శ్రేణులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.మధ్యాహ్నం సమయానికే మహాప్రస్థానం వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మసాబ్ ట్యాంక్, సరోజిని దేవి కంటి ఆసుపత్రి, మెహదీపట్నం, టౌలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగుతుంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్ఎండీసీ-ముస్తాఫా జ్యూవెలర్స్-సరోజినిదేవి హాస్పిటల్-మెహదీపట్నం మీదుగా టౌలిచౌకీ ఫ్లైఓవర్, షేక్‌పేట, విస్పర్ వ్యాలీ జంక్షన్ వెళ్లొద్దని ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: