తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) నటవారసులుగా హరికృష్ణ, బాలకృష్ణలు ఎంట్రీ ఇచ్చారు. అయితే బాలనటులుగా మెప్పించిన వీరిద్దరిలో బాలకృష్ణ హీరోగా కంటిన్యూ అయ్యారు. హరికృష్ణ మాత్రం తన తండ్రి ఎన్టీఆర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. అయితే హీరోగా నెంబర్ వన్ పొజీషన్లోకి వచ్చిన బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 1993 సెప్టెంబర్ 3 న బాలయ్య నటించిన రెండు చిత్రాలు ఒకే సారి రిలీజ్ అయ్యాయి.
నందమూరి నటసింహం నటించిన 'నిప్పురవ్వ', 'బంగారు బుల్లోడు' సినిమాలు విడుదలయ్యాయి. నిప్పురవ్వ ఫ్లాప్ కాగా, బంగారు బుల్లోడు కలెక్షన్ల వర్షం కురిపించింది. ‘బంగారు బుల్లోడు’ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత రాజమండ్రిలో డైరెక్టుగా రెండు చిత్రాలూ శతదినోత్సవాన్ని జరుపుకున్నాయి. అయితే ఒక టాప్ హీరో కి సంబంధించిన రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడం అనేది ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడు తెరకెక్కాయి. నిప్పురవ్వలో విజయశాంతి జంటగా నటించింది. బంగారు బుల్లోడు రమ్యకృష్ణ, రవీనా టాండన్ లు బాలయ్యతో స్టెప్పులేశారు. నేటికి ఈ రెండు చిత్రాలు రజతోత్సవం చేసుకుంటున్నాయి. పాతికేళ్లయినా బాలయ్య సృష్టించిన రికార్డు చెక్కు చెదరలేదు.