ఇటీవల అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్టు వార్తలు రావడంతో దుమారం మొదలైంది. ఈ వివాదం ఇప్పుడు పెద్దల వరకు వెళ్లింది. ముఖ్యంగా నిధులు దుర్వినియోగం చేశారని నరేష్ ఆరోపిస్తుంటే..తప్పుడు చేస్తే దేనికైనా సిద్దం అని అంటున్నారు మా అధ్యక్షులు శివాజీరాజా.
తాజాగా ఈ విషయంపై స్పందించిన..దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్..వీళ్ల విషయం చూస్తుంటే..‘కోపమొస్తోంది.. నవ్వొస్తోంది. నరేశ్, శివాజీ రాజా లిద్దరూ మంచి పిల్లలు. చిన్నప్పటి నుంచి వాళ్లు తెలుసు. నరేష్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరికీ ఏ రకమైన స్వార్థాలు లేవు. కానీ, వీళ్లిద్దరు ఇవాళ రోడ్డున పడటం బాధగా ఉంది.. కోపంగా ఉంది. అందరూ కలిసి అమెరికా వెళ్లొచ్చారు.
ఇప్పుడు..వాళ్లు ఇచ్చిన కోటి రూపాయలు కంటే ఎక్కువ వస్తుందా? మిగులుతుందా? అనే విషయం సంతకాలు పెట్టకముందు ఆలోచించుకుని ఉండాల్సింది. సంతకాలు పెట్టి వెళ్లి పోయాక ఆ డబ్బులు తినేశారని ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది.. శివాజీ రాజా, నరేశ్ లు ఆలోచించకుండా బజారున పడ్డారు. టీవీలలో మాట్లాడే వారికో అవకాశమివ్వడం తప్ప దీని వల్ల వచ్చేదేమీ లేదు. మీ ఇద్దరూ వచ్చి కూర్చుని సమస్యను పరిష్కరించుకోండి. మన కమిటీలో కూర్చుని మాట్లాడుకుంటే పనులు అయిపోతాయని నా ఆలోచన’ అని తమ్మారెడ్డి సూచించారు.