మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ మరో వివాదంలో చిక్కుకుంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై శివాజీ రాజా, శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ..‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. అసోసియేషన్లో 5 పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని శివాజీ రాజా సవాల్ చేశారు.
సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్ నిర్మించాలన్నదే తమ ఉద్దేశమని, అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కొంత మంది కావాలనే తమపై నిందలు వేస్తూ.. ఆరోపణలు చేస్తున్నారని వారు వివరించారు. కాగా, ఈ వివాదంపై స్పందించిన మా జనరల్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ..ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సమావేశాల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని మీడియాలో కథానాలు వచ్చాయి. వీటిపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని అధ్యక్షుడు శివాజీరాజాను కోరాను.
అప్పటి నుండి ఆయన కనిపించకుండా పోయారు. అంతే కాదు ఈ విషయంలో..ప్రభుత్వం జోక్యం చేసుకుని సిల్వర్ జూబ్లీ సమావేశాల నిధులు దుర్వినియోగంపై సీనియర్ ఐపీఎస్ అధికారితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో చెప్తే.. మిగతా సభ్యులతో మాట్లాడి చెబుతా అన్నారు. ఇదిలా ఉంటే..డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు 'మా' పరువును బజారుకు లాగగా... తాజాగా నిధుల దుర్వినియోగం గొడవ 'మా'ను సిగ్గుతో తలొంచుకునేలా చేసింది.
ప్రస్తుతం ‘మా’ అసోసియేషన్ రెండుగా చీలిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ వివాదంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు మహేష్ బాబు టూర్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే..కానీ ప్రస్తుతం నిధుల విషయంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఈవెంట్ ను మహేష్ బాబు క్యాన్సిల్ చేసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. ఇలాంటి సమయంలో తాను ఈ షోలో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్ ఉన్నాడట.