తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో సూపర్స్టార్గా మారిన కమెడియన్ ఎవరంటే అందరు చెప్పే పేరు.. ‘‘బ్రహ్మానందం’’. జంద్యాల దర్శకత్వంలో ‘అహనా పెళ్లంట’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాల్లో తనదైన మానరీజం జొప్పించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్న ఆయనకు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ‘‘గురుశ్రీ’’ పురస్కారంతో సన్మానించింది. అంతే కాదు సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకు గాను..భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.
అత్యధిక సినిమాల్లో నటించిన హాస్యనటుడిగా గిన్నిస్బుక్లోకి సైతం ఎక్కారు. ఆయన ఖాతాలో ఆరు నంది అవార్డులు కూడా ఉన్నాయి. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను..శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ‘‘గురుశ్రీ’’ పురస్కారంతో సన్మానించింది. ఈ సందర్భంగా బ్రహ్మానందంకు బంగారు కంకణం తొడిగి.. సన్మానించారు. గత 20 ఏళ్లుగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ఏపీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రముఖ గాయని పి.సుశీల, శ్రీ కళాసుధ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువు ప్రముఖులను సన్మానించారు.