గత కొద్దిరోజులుగా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే కాకుండా సినిమా అభిమానులకు కూడ హాట్ టాపిక్ గా మారిన ‘మా’ అసోసియేషన్ వివాదాలకు తెరదింపే ప్రయత్నాలలో భాగంగా చిరంజీవి మహేష్ లు చేస్తున్న ప్రయత్నాలకు ఒక పరిష్కారంగా సీనియర్ నటీమణి సహజనటి జయసుధ మారబోతోంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ పరువును బజారుకు ఎక్కించిన ‘మా’ సంస్థ వ్యవహారానికి ఒక సమర్దవంతమైన నాయకత్వం అవసరమని చిరంజీవి అభిప్రాయ పడుతున్నట్లు టాక్.
ఈనేపధ్యంలో మరికొన్ని నెలలలో జరగబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికలకు అందరికీ ఆమోద యోగ్యమైన అధ్యక్ష స్థానానికి అభ్యర్ధిగా జయసుధను సూచించాలని చిరంజీవి ఆలోచన అని అంటున్నారు. దీనికితోడు ‘మా’ సంస్థకు సొంత భవనం నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయలలో ఖర్చు పెట్టబోతున్న నేపధ్యంలో ఎటువంటి ఆరోపణలు లేకుండా సమర్ధవంతంగా ఒక హుందాతో జయసుధ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించ కలుగుతుందనీ చిరంజీవి వ్యక్తిగత అభిప్రాయానికి మహేష్ సపోర్ట్ కూడ ఉంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.
జయసుధ విజయనిర్మల కృష్ణ కుటుంబానికి బంధుత్వ రీత్యా చాల సన్నిహితురాలు కావడంతో పరోక్షంగా చిరంజీవి ఆలోచనలకు మహేష్ మద్దతు కూడ ఉంది అని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రాధమిక ఆలోచనలు మాత్రమే అనీ ఫిలిం నగర్ టాక్. దీనికి జయసుధ అంగీకారం కూడ రావలసి ఉంది.
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సంవత్సరంతో జయసుధ 60 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న నేపధ్యంలో టెన్షన్స్ కు దూరంగా ఉండాలని అదేవిధంగా ఇండస్ట్రీ రాజకీయాలకు కూడ దూరంగా ఉంటూ మరో రెండు మూడు సంవత్సరాలు సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో ఒక వర్గానికి పరిమితమై ‘మా’ సంస్థ అధ్యక్ష బాధ్యతను తీసుకుని తాను ప్రత్యేకంగా ఏమి చేయగలను అంటూ జయసుధ ఈమధ్య తనను కలిసిన సన్నిహితులతో కామెంట్ చేసినట్లు టాక్..