టాలీవుడ్ లో కి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రాంచరణ్. తర్వాత సినిమా దర్శకధీరుడు రాజమౌళి తీసిన సినిమా ‘మగధీర’తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాశాడు. ఆ సినిమాతో రాంచరణ్ కి నటన పరంగా ప్రశంసలు దక్కాయి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడి ‘బాహుబలి’ సినిమా రెండు పార్టులుగా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలే కాదు..జాతీయ, ప్రపంచ స్థాయిలో సునామీ సృష్టించింది. అయితే బాహుబలి సినిమా ఇతర దేశాల్లో రిలీజ్ చేసి మంచి కలెక్షన్లు రాబట్టారు.
ఇక ‘బాహుబలి2’ జపాన్లో విడుదలై సక్సెస్ఫుల్గా 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన ఆదరణను చూసిన రాజమౌళి... గతంలో తాను తెరకెక్కించిన 'మగధీర' సినిమాని కూడా జపాన్లో విడుదల చేశారు. జపాన్ లో రిలీజ్ అయిన ‘మగధీర’భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఇప్పటి వరకు 1.77 మిలియన్ డాలర్లను (సుమారు రూ.13 కోట్లు) కలెక్ట్ చేసింది. గతంలో రజనీకాంత్ సినిమా ముత్తు నెలకొల్పిన రికార్డులను అధిగమించింది.
ఇటీవల విడుదలై 1.2 మిలియన్లు వసూలు చేసిన బాహబలి కలెక్షన్లను కూడా మగధీర తిరగరాసింది. బాహుబలి సినిమా సమయంలో సుబ్బరాజుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు అక్కడి ప్రేక్షకులు. అప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో.. ఇప్పుడు మగధీరకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అంతగానూ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో మగధీర చిత్రం 35 కోట్ల రూపాయలతో తెరకెక్కింది.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.150 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహారించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందింది. ఆ తర్వాత మలయాళం, తమిళం భాషల్లోకి అనువాదమై ఘన విజయం సాధించింది.