ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహానటి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.  ఇప్పుడు మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు..ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు.  ఇక రాజకీయ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రాలతో పాటు  చంద్రబాబు, గోపీచంద్, కె. విశ్వనాథ్ ఇలా చాలా మంది ప్రముఖ సినీ, రాజకీయ జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ఉబలాటపడుతున్నారు దర్శకులు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్ ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలుస్తున్నారు ఆనందోబ్రహ్మ దర్శకుడు మహి రాఘవ.  ఇదిలా ఉంటే..తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.ఇప్పటికే వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటిస్తుండగా.. వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక, సూరీడు పాత్రలో పోసాని నటించనున్నట్టు తెలుస్తోంది.

అయితే వైఎస్సాఆర్ తనయుడు..ప్రస్తుతం వైసీపీ అధ్యక్షులు అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు కనిపిస్తారో అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.  తమిళ స్టార్ హీరో సూర్య అని ఒకసారి..లేదు ఆయన తమ్ముడు కార్తీ అని మరోసారి..ఇలా రక రకాల పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ మూవీలో కీలకమైన వైఎస్ జగన్ పాత్రను ఎవరు చేస్తారనే వార్తల నేపథ్యంలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ జగన్ రెడ్డిగా మెరవనున్నాడని తాజా సమాచారం. 

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాతో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవకొండ ఈ ప్రాజెక్ట్‌లో యాడ్ అయితే ‘యాత్ర’ చిత్రానికి హెల్ప్  అవుతుందని చిత్ర యూనిట్ భావించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 70 ఎంఎ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘యాత్ర’. 


మరింత సమాచారం తెలుసుకోండి: